అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, January 20, 2012

స్వేచ్ఛకు సంకెళ్లా?

సామాజిక మీడియా పీక నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం తెర వెనుక కుట్రలు సాగిస్తోంది. ప్రజా ఉద్యమాలకు ప్రచార కర్తగా, ఆందోళన, నిరసనకారునిగా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ పని చేస్తోందన్న భయమే కేంద్రాన్ని కుట్రలు కుతంత్రాల వైపునకు లాక్కుపోతోంది. సోషల్‌ మీడియా విస్తృతికి చెక్‌ పెట్టాలని, నిబంధనల మాటున సమాచారాన్ని నాలుగ్గోడల మధ్య బంధించాలని పన్నాగం పన్నుతోంది. గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితర వెబ్‌సైట్లలో అశ్లీల, అసభ్యకర, జాతి
సమగ్రతకు భంగం కలిగించే సమాచారంపై సెన్సార్‌ ఉండాలని కేంద్ర కమ్యూనికేషన్స్‌ మంత్రి కపిల్‌ సిబల్‌ ఇటీవల ప్రతిపాదించారు. తలచిందే తడవు ఢిల్లీ మెట్రో పాలిటన్‌ కోర్టులో సిబల్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలే ప్రధాన ఆరోపణలుగా కేసు పడింది. విచారణ చేపట్టిన కోర్టు గత నెల 23న గూగుల్‌, ఫేస్‌బుక్‌ సహా 21 సంస్థలకు సమన్లు జారీ చేసింది. ఆ సంస్థల్లో పది విదేశాలకు చెందినవి. ఆ వెబ్‌సైట్లు అశ్లీల, అసభ్యకర సమాచారాన్ని కలిగి ఉన్నట్లు మా వద్ద ఆధారాలున్నాయి, ఐపిసి సెక్షన్ల కింద విచారణ జరిపించాలి అని కేంద్ర సమాచార సాంకేతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోర్టుకు గత శుక్రవారం నివేదిక సమర్పించగా సమన్లు అందేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 13కు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలను పక్కన పెడితే కపిల్‌ సిబల్‌ మనసులో ఉన్నది కేసు రూపం దాల్చడమే వైపరీత్యం. ప్రభుత్వం ఫలానిది చేయాలనుకోవడం తన పరోక్షంలో ఎవరో ఒకరి చేత కోర్టుల్లో కేసులు వేయించి తను అనుకున్నదాన్ని ఎటువంటి చర్చ లేకుండా అమలు చేసి కాగల కార్యాన్ని గంధర్వులు చేసినట్లు ఫోజు పెట్టడం ఇటీవలి కాలంలో రివాజైపోయింది. కోర్టుల పేర సర్కార్‌ తొక్కుతున్న ఇలాంటి అడ్డదారులపై విస్తృత చర్చ జరగాల్సి ఉంది.

ప్రపంచీకరణ ప్రారంభమయ్యాక సమాచార మార్పిడిలో ఎల్లలు చెరిగిపోయేంతగా ఐటి వృద్ధి అయింది. 1991లో ఆర్థిక మంత్రిగా సరళీకరణ విధానాలను దేశానికి పరిచయం చేసిన మన్మోహన్‌సింగ్‌ 2004 నుండి ప్రధానిగా ఆ విధానాలను తలకెత్తుకున్నారు. మీడియాలో సైతం ఎఫ్‌డిఐలను ఎలాంటి జంకు లేకుండా ఆహ్వానిస్తున్నారు. రోజూ ఐటి పల్లవిని ఆలపిస్తున్న సదరు మన్మోహన్‌ ప్రభుత్వమే సోషల్‌ మీడియాపై కత్తి కట్టడానికి వెనుక పెద్ద కారణమే ఉంది. గ్లోబలైజేషన్‌ యుగంలో సంప్రదాయ మీడియా కార్పొరేట్‌కు దాసోహం అంటోంది. సామాన్యుల సమస్యలు, ప్రజా ఉద్యమాలు దానికి పట్టట్లేదు. కార్పొరేట్‌ మీడియాకు సామాజిక దృక్ఫథం కొరవడింది. రైతుల ఆత్మహత్యలపై కించిత్తు చలించకుండా ఫ్యాషన్‌ షో వార్తలకు, రియాల్టీ షోలకు ఎక్కడ లేని ప్రాధాన్యమిచ్చే జాఢ్యం ప్రస్తుతం మీడియాకు అంటుకుంది. దీంతో అది సమాజం నుండి వేరుపడుతోంది. ఈ పరిస్థితిని సామాజిక వెబ్‌సైట్లు అందిపుచ్చుకున్నాయి. తొలి రోజుల్లో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ పక్కా వ్యాపార అవసరాల నుండే పుట్టింది. తమ వస్తువుల గురించి ప్రచారం చేసి అమ్ముకోవడం, వినియోగదారుల చేత తమ ప్రొడక్టును ప్రమోట్‌ చేయించడం ఆ సైట్ల లక్ష్యం. సామాన్యులకు సైతం ఐటీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ-సాఫ్ట్‌వేర్‌ ఉద్యమం బయలుదేరాక కార్పొరేట్‌ సంస్థలు తమ అవసరార్ధం ఓపెన్‌ సోర్స్‌ పేరుతో ఆ విధానానికి మళ్లక తప్పలేదు. గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితరాలన్నీ వ్యాపార సంస్థలే. తమ అవసరార్ధమే అయినా ప్రజలకు భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నాయి. ఇలా ఫ్రీ-సాఫ్ట్‌వేర్‌, ఓపెన్‌ సోర్స్‌ రెండు పద్ధతులూ సాఫ్ట్‌వేర్‌ను సామాన్యుల చెంతకు చేరుస్తున్నాయి. భావ వ్యక్తీకరణకు ఎలాంటి ఆంక్షలు, ఆటంకాలు లేకుండా ప్రజలు బ్లాగింగ్‌, మైక్రో బ్లాగింగ్‌లను వినియోగించుకుంటున్నారు. స్వేచ్ఛగా ప్రజలు తమ భావాలను పంచుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇటీవల ట్యూనీషియా, ఈజిప్టు తదితర అరబ్‌ దేశాల్లో ప్రజల ఆందోళనలు పెల్లుబకడానికి, నియంతల ప్రభుత్వాలకు కాలం చెల్లడానికి వెనుక సోషల్‌ మీడియా ప్రముఖ పాత్ర పోషించింది.
అమెరికాలో వాల్‌స్ట్రీట్‌ ఉద్యమానికి సోషల్‌ సైట్లు ఇరుసుగా పని చేస్తున్నాయి. సామ్రాజ్యవాద అమెరికా దాష్టీకాలను, అక్రమాలను వెలుగులోకి తెచ్చిన వికీలీక్స్‌ సంగతి సరేసరి. అగ్రరాజ్యం అమెరికా సహా అనేక దేశాలను ఊపేస్తున్న సోషల్‌ మీడియా ఫోబియా మన్మోహన్‌ సర్కార్‌కూ పట్టుకుంది. తను అమలు చేస్తున్న సరళీకరణ విధానాలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2జి సహా పలు అవినీతి ఉదంతాలతో ప్రభుత్వ ప్రతిష్ట పాతాళానికి దిగజారింది. అవినీతిపై అన్నాహజారే నిర్వహించిన ఉద్యమానికి సోషల్‌ మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం, మద్దతు లభించడంతో సర్కార్‌ వెన్నులో వణుకు మొదలైంది. అందుకే అశ్లీలం, అసభ్యం వంటి కుంటి సాకులతో సోషల్‌ నెట్‌వర్కింగ్‌పై కొరడా ఝుళిపించి ప్రజాగ్రహాన్ని నియంత్రించే దుస్సాహసానికి పూనుకుంది. వెబ్‌సైట్ల వల్ల 340 రకాల నష్టాలున్నాయని కపిల్‌ సిబల్‌ చెప్పగా వాటిలో 224 ప్రభుత్వ వ్యతిరేక స్వభావం కలిగినవి. అంటే ప్రభుత్వం ఏం చేసినా ప్రజలు కనీసం నిరసన కూడా తెలపకూడదన్నమాట. ఇంటర్నెట్‌ అనేది మానవ హక్కు అని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. సరిహద్దులను బద్దలుకొట్టే ప్రపంచీకరణ నుంచే సరిహద్దులు చెరిపేసే ఐటి ఆవిర్భవించింది. దాన్ని ప్రభుత్వమే అనుమతించింది. సరళీకరణ విధానాలను తలకెత్తుకున్న మన్మోహన్‌ సర్కారే తన పుట్టి మునుగుతుందని భయపడి సోషల్‌ నెట్‌వర్కింగ్‌పై కన్నెర్ర చేస్తోంది. వెబ్‌సైట్లపై ఆంక్షలు విధించడంపై ఎలాంటి చర్చ జరగలేదు. అసభ్యం, అశ్లీలం, ప్రజల్లో శత్రుత్వానికి కారణమయ్యే సమాచారాన్ని నిరోధించాల్సిందే. దాని మాటున ప్రజల భావ వ్యక్తీకరణకు ఉపకరిస్తున్న సోషల్‌ నెట్‌వర్కింగ్‌ను తుదముట్టించాలనుకోవడం మూర్ఖత్వమే. ప్రజల స్వేచ్ఛను, భావ వ్యక్తీకరణ హక్కును నియంత్రించాలనుకోవడమనేది సూర్య కాంతిని అరచేతితో అడ్డుకోవాలనుకొనే దుస్సాహసం వంటిది.

No comments:

Post a Comment