అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, January 20, 2012

తెలుగు తల్లి ముద్దుబిడ్డ సుందరయ్య


దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, నిష్కల్మష వ్యక్తిత్వం, నిరాడంబర జీవితం, నిస్వార్దతకు నిలువెత్తు రూపం,కామ్రేడ్‌ సుందరయ్య!
1913 మే 1వ తేదీన నెల్లూరు జిల్లా అలగానిపాడులో భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. కాంగ్రెస్‌ పార్టీ పిలుపుపై 17 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్‌ కోర్సు మధ్యలో వదలిపెట్టి 1930లో సహాయ నిరాకరణ
ఉద్యమంలో ప్రవేశించారు. ఆయనను అరెస్టు చేసి బాల ఖైదీల స్కూలుకు పంపితే అక్కడ సోషలిస్టు భావాలు వంటపట్టించుకున్నారు. తిరిగి వచ్చి దేశంలోనే తొలి వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించారు. అమీర్‌ హైదర్‌ ఖాన్‌ ద్వారా కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చి దక్షిణ భారత దేశంలో దాన్ని నిర్మించేందుకు, విస్తరించేందుకు బాధ్యతలు స్వీకరించారు. ఎందరో ప్రముఖులను కమ్యూనిస్టులుగా మార్చారు. వారిలో ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌, ఎకెగోపాలన్‌, కృష్ణపిళ్లైవంటి వారున్నారు. దేశంలోని వివిధ కమ్యూనిస్టు గ్రూపులు ఏకమై 1936లో తొలి కేంద్ర కమిటీ ఏర్పడినప్పుడు సుందరయ్య అందులో సభ్యులయ్యారు. 1948 -52 మధ్య జరిగిన వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన వారిలో ఆయన ముఖ్యులు. తొలి జనరల్‌ ఎన్నికల తర్వాత రాజ్యసభకు ఎన్నికై పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పని చేశారు. ఆయన రాసిన 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' రాష్ట్ర సమగ్రాభివృద్దికి అద్భుతమైన ప్రణాళికను ఆవిష్కరించింది. 1955లో శాసనసభలో ప్రతి పక్ష నాయకుడిగా అమోఘమైన పాత్ర నిర్వహించారు. పార్టీలో వచ్చిన సైద్ధాంతిక మితవాద, అతివాద పెడ ధోరణులు రెంటినీ తోసిపుచ్చి పార్టీని కంటికి రెప్పలా కాపాడారు. సిపిఐ (ఎం)గా ఏర్పడిన తర్వాత తొలి ప్రధాన కార్యదర్శి అయ్యారు.1977 వరకు ఆ బాధ్య తలలో కొనసాగారు. ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ప్రజా ఉద్యమాల పెంపుదలకు దోహ దపడ్డారు. తన జీవిత కాలంలో ఆయన అనేక సోషలిస్టు దేశాలు పర్యటించారు. సుందరయ్య జీవితం చాలా భాగం అజ్ఞాత వాసాలతో, కారాగార జీవితంతో గడచింది. 1964 - 1966 మే వరకు జైలులో వున్నారు. అప్పుడే తీవ్రమైన అనారోగ్యం రావడంతో చికిత్స కోసం మాస్కో వెళ్లారు. ఎమర్జన్సీ కాలం లోనూ రహస్య జీవితం గడిపారు.1978లో మరోసారి శాసనసభకు ఎన్నికైనారు. విశాల ప్రజా ఉద్యమాల పెంపుదలకు సారథిó అయ్యారు. 1980 అఖిలపక్ష ఉద్యమం వాటిలో చెప్పుకోదగినది. 1982లో ఆయన రాష్ట్ర పార్టీ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయనకు మూత్ర పిండాలు పని చేయకపోవడం వల్ల తీవ్రమైన అనారోగ్యంతో 1985 మే 19న తుది శ్వాస విడిచారు. రాష్ట్ర చరిత్రలోనే అరుదైన విధంగా ఆయన అంతిమ యాత్రకు లక్షలాది జనం తరలి వచ్చి జోహారులర్పించారు. ఆయన స్మృతిచిహ్న్గంగా హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్మితమైంది. ఆయన ఆదర్శ జీవితం కమ్యూనిస్టులకు నిరంతరం ప్రేరణ కలిగిస్తూనే ఉంది. 

No comments:

Post a Comment