అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Thursday, April 26, 2012

' తూర్పు'లో 'ఉపాధి' అంతంతమాత్రం!

  • చాలాచోట్ల కూలి రూ.40తో సరి
  • 12 వేల కుటుంబాలకే 100 రోజుల పని
ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రతి కూలీకీ 125 రోజులు పని కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా కనీసం 100 రోజుల పనిదినాలు కూడా కల్పించడం లేదు. తూర్పు గోదావరి జిల్లాలో గతేడాది 5.92 లక్షల జాబ్‌ కార్డులు జారీ చేసినా 12,205 కుటుంబాలకే వంద రోజుల పని కల్పించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది కూలీలు 125 రోజుల పనిదినాలు పొందడం లేదు. ఒక క్యూబిక్‌ మీటరు పనికి గతంలో రూ.121 కూలి చెల్లించేవారు. నిబంధనల ప్రకారం ప్రస్తుతం రూ.137 చెల్లించాలి. వేసవిలో తాగునీటికి అదనంగా రూ.అయిదు, వేరే ప్రాంతంలో పని చేస్తే ఛార్జీలకు రూ.అయిదు, గునపం కూలీలే తెచ్చుకుంటే రూ.10, పారకు రూ.మూడు, తట్టకు రూ.మూడు ఇవ్వాల్సి ఉంది. ఈ విధంగా రోజుకు రూ.163 వరకూ చెల్లించాలి. కానీ ఒక్కో ప్రాంతంలో రోజుకు రూ.140, మరో ప్రాంతంలో రూ.120, కొన్ని చోట్ల రూ.40 రూ.50 చెల్లిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో కూలి చెల్లింపులో భారీ వ్యత్యాసం ఉండటంతో కూలీలు ఉపాధి పని అంటే ఆసక్తి చూపడం లేదు.
125 రోజుల పనిదినాలు కలేనా?
ఉపాధి హామీ చట్టం ద్వారా ఏడాదికి 125 రోజుల పనిదినాలు కల్పించాల్సి ఉన్నా అది అమలు జరగడం లేదు. జిల్లాలో 2007 నుంచి 58 మండలాల్లోని 1012 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం అమలౌతోంది. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 2,35,699 కుటుంబాలకు గాను 13 వేల కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని కల్పించారు. లక్షలాది కుంటుంబాలకు వంద రోజులు కూడా పని కల్పించని ప్రభుత్వం 125 రోజులు పని కల్పిస్తుందనుకోవడం అడియాశగానే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రోజువారీ సగటు వేతనం రూ.106.25 ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.115గా ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 5.92 లక్షల జాబ్‌ కార్డులు జారీ చేసిన అధికారులు ఏప్రిల్‌ 25 నాటికి 1.14 లక్షల మందికి ఉపాధి కల్పించగలిగారు.
ఉపాధిలో రూ.5.20 కోట్ల అవినీతి..
ఉపాధి పథకంలో ఆరేళ్లలో జిల్లాలో రూ.5.20 కోట్ల అవినీతి జరిగినట్టు అధికారుల సామాజిక తనిఖీల్లో బట్టబయలైంది. ఈ అవినీతికి సంబంధించి 2277 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినా, 666 మందిపైనే చర్యలు తీసుకున్నారు. మిగిలిన వారిపై ఇప్పటికీ చర్యలు లేవు. ఈ మొత్తంలో ఇప్పటివరకూ రూ.79,67,619 మాత్రమే రికవరీ చేశారు.
మేట్స్‌, ఫీల్డు అసిస్టెంట్లపై నెపం మోపుతున్న అధికార్లు
జిల్లాలో రోజుకు 1.14 లక్షల మందికి ఉపాధి కల్పించివారికి రూ.1.20 కోట్లు కూలిగా చెల్లిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ 25 నాటికి రూ.18.7 కోట్లు కూలీలకు చెల్లించామని వారు అంటున్నారు. కానీ అనేక ప్రాంతాల్లో కూలి రేట్లలో వ్యత్యాసం భారీగా ఉండడానికి మేట్స్‌, ఫీల్డు అసిస్టెంట్లే కారణమని అధికారులంటున్నారు. పని విభజన సమయంలో ఎంతమేరకు ఎన్ని గంటలు పని చేయాలి అనే విషయాలను కూలీలకు వివరించడంలో ఫీల్డు అసిస్టెంట్లు విఫలమయ్యారని అధికారుల వాదన.
కోరుకొండ మండలం కోటి కేశవరంలో 163 మంది కూలీలు ఉపాధి హామీ పని చేస్తున్నారు. వీరంతా నాగంపల్లి, కోటికేశవరం గ్రామాల మధ్య ఉన్న వినుకొండ కాలువ, నల్ల చెరువుల్లోని పూడికతీత పనులు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకూ వారు ఐదు రోజుల పాటు రోజంతా కష్టపడితే వారికి దక్కిన రోజువారీ వేతనం రూ.40 మాత్రమే. ఇదేమని కూలీలు ప్రశ్నిస్తే చేసిన పనికి లెక్కగట్టి డబ్బులు చెల్లిస్తున్నామని ఉపాధి హామీ ఎపిఓ చెబుతున్నారు. జిల్లాలో అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి.

No comments:

Post a Comment