అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, May 7, 2012

అడుగంటిన జలం...శుద్ధి ప్లాంట్లకు కష్టకాలం



వరుసగా రెండేళ్లుగా తీవ్ర వర్షాభావం ఫలితం
పంచాయతీల ఆధ్వర్యంలో నడిచే వాటికీ ఇబ్బందులే
తూర్పు రంగారెడ్డి, న్యూస్‌టుడే:
జిల్లాలో అడుగంటిన భూగర్భ జలాల ప్రభావం సాగు, తాగునీటితో పాటు నీటి శుద్ధి ప్లాంటపై కూడా పడింది. మానవుడికి వచ్చే రోగాల్లో ఎక్కువ శాతం తాగునీటి ద్వారానే వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు శుద్ధి నీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కుటుంబ సభ్యులంతా తాగడానికి, ఇంట్లో ఏదైనా విందు వినోదాలు నిర్వహించినా ఇంతకుముందులా కాకుండా డబ్బా నీటి (శుద్ధినీరు) వినియోగం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో దాదాపు అన్ని పెద్ద గ్రామాల్లో శుద్ధి నీటి ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ఇపుడు వాటి మనుగడకు ముప్పు ఏర్పడనుంది. ఎందుకంటే జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడం వల్లే. ఈ కారణంతో జిల్లాలో చాటా మటుకు నీటిశుద్ధి ప్లాంట్లు మూతపడుతున్నాయి. ఈ కారణంగా పలువురికి ఉపాధి కూడా కోల్పోతున్నారు. * గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారుల అయిదేళ్ల క్రితం యాచారం మండలం మేడిపల్లిలో నీటిశుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఆటంకం లేకుండా అది పని చేస్తోంది. గ్రామ పంచాయతే దీన్ని నిర్వహిస్తోంది. రూ.రెండుకు బిందె చొప్పున నీటిని అందిస్తున్నారు. నాలుగు నెలలుగా అది పని చేయడం లేదు. కారణం బోరు ఎండి పోయింది. దీంతో గ్రామస్థులు శుద్ధినీటిని కొని తాగడం కష్టంగా మారింది. రెండు రోజుల క్రితం ప్రజాపథంలో గ్రామస్థులు పట్టుబట్టడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ప్లాంటును నడిపిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
* ఇబ్రహీంపట్నంలో మొదట్లో ప్లాంట్‌ ఏర్పాటు చేసిన వారిలో యాదయ్య ఒకరు. నాలుగేళ్లుగా ప్లాంట్‌ ఏ ఇబ్బంది లేకుండా నడుస్తోంది. పలువురికి ఉపాధి కూడా చూపిస్తున్నాడు. తొలుత ఏర్పాటు చేసిన స్థలంలో బోర్లు ఎండిపోవడంతో మరోచోట బోర్లు వేసి ప్లాంట్‌ను అక్కడికి మార్చాడు. వెయ్యి అడుగుల లోతు వరకు బోరు వేయించాడు. వస్తున్న నీటిని చూసి ఇబ్బంది లేదనుకున్నాడు. ఇటీవల ఒక్కసారిగా నీటిమట్టం తగ్గడంతో అతని పరిస్థితి సందిగ్ధంలో పడింది.
* ఇబ్రహీంపట్నంలో తక్కువ ధరకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు డాక్టర్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. బోరు ఎండిపోవడంతో దాన్ని మూత పెట్టారు.
* జిల్లాలో భూగర్భ జలమట్టం దారుణంగా 14.81 అడుగుల లోతుకు పడిపోయింది. 108కి పైగా గ్రామాలు అత్యంత ప్రమాదకర పరిస్థితికి చేరాయి. దీంతో నీటి కరవు ఏర్పడుతోంది.
* ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లోని అధిక గ్రామాలకు కృష్ణా నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ నీరు కలుషితం కాకుండా సరఫరా చేస్తే చాలావరకు రక్షిత నీరు అందుతుంది. ఎక్కడా నమ్మకంగా అందడంలేదు. బోరు నీటితో కలిపి కొన్నిచోట్ల, లీకేజీలతో మరికొన్ని చోట్ల కలుషితం అవుతున్నాయి.
కరవుతో తాగునీటికి కష్టాలొచ్చాయి. నీటిశుద్ధి ప్లాంట్లు నీటి కొరతతో మూత పడుతున్నాయి. రూ.లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసుకున్న వారు నీటి కోసం ఎన్ని బోర్లు వేసినా ఫలితం లేక అల్లాడుతున్నారు. ఉపాధి దెబ్బతింటోందని వాపోతున్నారు. జిల్లాలో 12 వందల వరకు ప్లాంట్లు ఉండగా అందులో ఏప్రిల్‌ చివరి నాటికి 100 వరకు మూతపడ్డాయి. మరికొందరు ఎలాగోలా నీటిని తెచ్చి శుద్ధిచేసి అమ్ముకుంటున్నారు. ఎండలు మండుతుండటంతో శుద్ధినీటికి డిమాండ్‌ బాగా పెరిగింది. గతం కంటే మూడింతల అమ్మకాలు జరుగుతున్నాయి. మారుమూల పల్లెల్లో సైతం శుద్ధినీటికి తాగడానికి జనం మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం రక్షితజలం అందించడంలో విఫలం కావడంతో శుద్ధినీటికి ప్రాధాన్యం పెరిగింది. జల, వాయు కాలుష్యంవిపరీతంగా పెరగడంతో తాగునీటి విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంటురోగాలు ప్రబలుతున్నాయి. అందుకే అనేక కుటుంబాల వారునెలకు రూ.300-600 వరకు శుద్ధి నీటి కోసం ఖర్చు చేస్తున్నారు. ఇంతగా ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో భూగర్భజలాలు అడుగంటినీటిశుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

No comments:

Post a Comment