అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, July 2, 2012

అడుగడుగునా దోపిడీ

 ప్రజాశక్తి-సిద్దిపేట   Sun, 1 Jul 2012, IST  
  • బీడీ' కార్మికులను మోసగిస్తున్న యాజమాన్యాలు
  • పొద్దస్తమానం పని-పూటగడవని దుస్థితి
  • ప్రభుత్వాలు మారినా..అమలుకు నోచని జిఓలు
  • మొదక్‌లో లక్ష మంది కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం కరువు
  • హక్కుల సాధనకు ఉద్యమించాలి : ఎపి బీడీ వర్కర్స్‌్‌ యూనియన్‌ (సిఐటియు)
రాష్ట్ర వ్యాప్తంగా బీడీ పరిశ్రమపై 10 లక్షలకు పైగా కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలోని మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి, నల్గొండ, కర్నూల్‌, అనంతపురం తదితర జిల్లాల్లో
అత్యధికంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీడీ కంపెనీలలో దేశాయి, ఒంటెషాప్‌, వాణినవశక్తి, టెలిఫోన్‌, టాకూర్‌ సౌదేకర్‌, యంఎస్‌ లంగర్‌, బాద్‌షాహీ, శివాజీ, చార్‌బాయి లతో పాటు తదితర 60 కంపెనీలకు పైగా బీడీలను ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా సిద్దిపేట నియోజకవర్గంలో 30 వేల మంది, దుబ్బాక నియోజకవర్గంలో 25 వేల మంది, గజ్వేల్‌ నియోజకవర్గంలో 15 వేల మంది మెదక్‌ నియోజకవర్గంలో 10 వేల మంది, అందోల్‌ నియోజకవర్గంలో 5వేల మంది, నర్సాపూర్‌ నియోజకవర్గంలో 5 వేల మంది, పటాన్‌చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో నామమాత్రంగా బీడీ కార్మికులు పనిచేస్తున్నారు. జిల్లాలో 40 కోట్ల బీడీలను తయారు చేసి తద్వారా నాలుగు కోట్ల రూపాయల వేతనాన్ని కార్మికులు పొందుతున్నారు. ఇక్కడ తయారు చేసిన బీడీని దక్షిణాది రాష్ట్రాలైన గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎగుమతవుతుంది. జిల్లాలో దేశాయి, ఠాకూర్‌ సావదేకర్‌, ఎమ్మార్‌లగార్‌, బాదుషాహి, శివాజీ, షారుబాయి, హీరాలాల్‌, ఉత్తం కంపెనీలున్నాయి.

యాజమాన్యాలు శ్రమ దోపిడీ
ముడి సరుకు సరఫరా నుంచి బీడీలు సేకరించేవరకూ యాజమాన్యాలు కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయి. తీసుకున్నప్పటి నుంచి బీడీలు చుట్టి వాటిని అందజేసేంత వరకూ బీడీ కార్మికులను మోసం చేస్తున్నారు. పెద్ద బీడీలకు 800 గ్రాముల ఆకు, 250 గ్రాముల తంబాకు, చిన్న బీడీలకు 600 గ్రాముల ఆకు, 220 గ్రాముల తంబాకు అందజేస్తున్నారు. దీంతో 600 నుంచి 800 బీడీలు మాత్రమే తయారవుతాయని కార్మికులు తెలుపుతున్నారు. వారిచ్చిన లెక్కల ప్రకారం మంచి ఆకు, తంబాకు అయితే వెయ్యి బీడీల వరకు చుట్టవచ్చని కార్మికులు చెబుతున్నారు. షాట్‌ బీడీ పేరిట వెయ్యికి రెండు బీడీ కట్టలను కోత విధిస్తున్నారు. తగ్గిపోయిన ఆకు, తంబాకుకు కూలి డబ్బుల్లో కోత విధించి వేతనాలు చెల్లిస్తున్నారు. బీడీ తయారీకి నాసిరకమైన ఆకును అందిస్తున్నారు. తద్వారా తగినంత బీడీలు ఉత్పత్తి కావడం లేదు. ఆ నష్టాన్ని కార్మికులనుండి వసూలు చేయడం యాజమాన్యాలకు అలవాటుగా మారింది. తంబాకు సరఫరాలో తూకంలో మోసాలకు పాల్పడుతున్నారు. తంబాకు తక్కువ పడితే కార్మికులే కొనాల్సిన పరిస్థితి నెలకొంది. నెలంతా కష్టించిన ప్రతినెలా మొదటి వారంలో వచ్చే బట్వాడా బిల్లుల కోసం కళ్లు కాయలు కాచేవిధంగా ఎదురుచూడాల్సిన దుస్థితి బీడీ కార్మికులకు ఏర్పడింది. ఎలాంటి కారణాలూ లేకుండానే యాజమాన్యాలు నెలల తరబడి బట్వాడా బిల్లులు ఆలస్యం చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిఓ అమలు శూన్యం..
జిఓ నం. 41 ప్రకారం కార్మికులకు వెయ్యి బీడీలకు రూ.158 ఇవ్వాల్సుండగా రూ.115 రూపాయలు మాత్రమే యాజమాన్యాలు చెల్లిస్తున్నాయి. ఉద్యోగులైన గంపచాట్‌, బట్టీ, గుమస్తాలకు కనీస వేతనం రూ.5500 నుండి 7,800 వరకు ఇవ్వాల్సుండగా 4,500 మాత్రమే ఇస్తూ కార్మికుల శ్రమను యాజమాన్యాలు దోచుకుంటున్నాయి. కార్మికుల సంక్షేమాన్ని పర్యవేక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలతో పాటు కార్మికులకు కనీససౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. దీనిపై కార్మికులు యాజమాన్యాలను ప్రశ్నించినా నష్టాల్లో ఉన్నామని కంటి సాకులు చెబుతూ కార్మికుల పొట్టగొడుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలతో పైరవీలు నడిపించి జిఓలను అమలు కాకుండా అడ్డుకుంటున్నాయి. నెలలో 24 రోజులు పని కల్పించాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకూ అమలుకు నోచుకున్న దాఖలాలు లేవు. ఇటీవల సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల పోరాటానికి దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యం దిగి వచ్చి నెలలో 14 రోజులు మాత్రమే పనిదినాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
ఉపాధికి దూరం అవుతున్న కార్మికులు
బీడీకార్మికులు ప్రతీ సంవత్సరమూ తగ్గిపోతున్నారు. 2009-11 సంవత్సరానికి పది శాతం మంది కార్మికులు తగ్గిపోయారు. ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యమే కారణం. జిఓ 97ను జారీ చేసి బీడీ కట్టపై పుర్రెబొమ్మను ముద్రించాలని నిర్ణయం తీసుకోవడం, పనిరోజులు తగ్గడం, కనీస వేతనాలు అమలుకాకపోవడంతో కార్మికులు బీడీలు చుట్టడానికి ముందుకు రావడం లేదు. గతంలో బీడీలు చుట్టడం నేర్చుకోవడానికి వెళ్లేవారు. కానీ ప్రస్తుతం మాత్రం అలా లేదు. టేలరింగ్‌, కంప్యూటర్‌, ఎంబ్రాయిడింగ్‌ పట్ల శిక్షణ తీసుకోవడం, ఉన్నత చదువులు చదువుకోవడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు.
అనారోగ్యం కూడా ఒక కారణమే...
బీడీ కార్మికులకు మెడ నరాలు లాగడం, నడుం నొప్పిరావడం, కడుపునొప్పి, కంటి సమస్యలు, గొంతులో మంట, ఆస్తమా, టిబి, బ్రొంకటైస్‌, రక్తహీనత, తలతిప్పడంలాంటి వ్యాధులు సోకుతున్నాయి. కొంత మంది బిపి, సుగర్‌ వ్యాధులకు గురౌతున్నారు. కార్మికుల ఆరోగ్యాలను కాపాడాల్సిన ఇఎస్‌ఐ ఎక్కడుందో కార్మికులకు తెలువని పరిస్థితి. ఒక వేళ ఇఎస్‌ఐకి వెళ్లినా ఎవోకొన్ని మందు బిల్లలిచ్చి సరిపెడుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
హక్కుల సాధనకు పోరాటాలకు సిద్ధంకావాలి
ఎపి బీడీ వర్కర్స్‌్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపాలస్వామి
పోరాడి సాధించుకున్న జిఓల అమలు కోసం కార్మికులు పోరాటాలకు సిద్ధంకావాలి. కార్మికులకు సిఐటియు ఎళ్లవేళలా అండగా ఉంటుందన్నారు. సిఐటియు కార్మికులు ఏకం చేసి పోరాడినందు వల్లే జిఓ 41ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. పిఎఫ్‌, పని భద్రత, కూలి పెంపుకోసం సిఐటియు ఎంతగానో కృషిచేసిందన్నారు. జిఓను అమలు చేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేస్తోంది. బీడీ కార్మికులకు1995 నూతన పెన్షన్‌ విధానంతో అన్యాయం జరుగుతుందని గ్రహించిన సిఐటియు కార్మికులకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని డిమాండు చేసింది. బీడీ కార్మికులకు ఇప్పటికైనా రూ.1500 పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. వైద్య పరమైన సమస్యలను పరిష్కరిం చాలని కోరుతున్నాం. సిఐటియు రాష్ట్ర 13వ మహాసభల్లో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.

No comments:

Post a Comment